తెలంగాణకు 9 పతకాలు

7 Feb, 2019 10:34 IST|Sakshi

జాతీయ అథ్లెటిక్స్‌ టోర్నీ

అడ్డగుట్ట: జాతీయ స్కూల్‌ అథ్లెటిక్స్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో తెలంగాణ బృందం మొత్తం 9 పతకాలను గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శివాని, మైథిలి, మెడ్లీ, రూప, అక్షిత, ఇందుప్రియలతో కూడిన రాష్ట్ర బృందం 6 రజతాలు, 3 కాంస్యాలను సాధించింది.

రాష్ట్రం లోని పలు జిల్లాలకు చెందిన ఈ విద్యార్థినులు జాతీయ స్థాయిలో రాణించడం హర్షనీయమని స్కూల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ సరళ అన్నారు. లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పతకాలు సాధించిన వారిని అభినందించారు. ఈ ప్రదర్శనతో వీరంతా జాతీయ క్యాంపులో చోటు దక్కించుకున్నారని తెలిపారు. శిక్షణలో మెరుగ్గా రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్య, వసతితో పాటు మెరుగైన అథ్లెటిక్స్‌ శిక్షణను అందిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు