తెలంగాణ జట్టుకు కాంస్యం

2 Mar, 2018 10:26 IST|Sakshi
కాంస్య పతకాలతో తెలంగాణ మహిళల జట్టు

ఆలిండియా టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత అంతర్రాష్ట్ర టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో భిలాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ సెమీస్‌లో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 2–1తో తెలంగాణపై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (తెలంగాణ) 6–2, 4–6, 7–5తో శ్వేత రాణా (ఢిల్లీ)పై గెలుపొందడంతో తెలంగాణ 1–0తో ఆధిక్యాన్ని సాధించింది.

రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) 6–1, 6–1తో మౌళిక రామ్‌ (తెలంగాణ)పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో రిషిక సుంకర– ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) ద్వయం 6–0, 6–1తో సింధు జనగామ– శ్రావ్య శివాని (తెలంగాణ) జోడీపై నెగ్గడంతో తెలంగాణకు ఓటమి తప్పలేదు.  

మరిన్ని వార్తలు