తెలంగాణ లిఫ్టర్ల పతకాల పంట

16 Sep, 2019 10:19 IST|Sakshi

వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 13 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 6 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్‌ పురుషుల, యూత్‌ బాలికల విభాగాల్లో తెలంగాణ జట్లు ఓవరాల్‌ చాంపియన్‌లుగా నిలిచాయి. జూనియర్‌ పురుషుల విభాగంలో జి. కుమార స్వామి (178 కేజీలు), యశ్వంత్‌ (235 కేజీలు), చైతన్య హరి (158 కేజీలు), అఖిల్‌ (270 కేజీలు) బంగారు పతకాలు అందుకోగా...  మహేశ్‌ (166 కేజీలు) రజతాన్ని, రోహిత్‌ కుమార్‌ (122 కేజీలు) కాంస్యాన్ని గెలుచుకున్నారు.

యశ్వంత్‌ ‘ఉత్తమ లిఫ్టర్‌’ పురస్కారానికి ఎంపికయ్యాడు. యూత్‌ బాలికల విభాగంలో ఆర్తిక (72 కేజీలు), ప్రసన్న (62 కేజీలు) స్వర్ణాలతో మెరవగా... శేష సాయి (67 కేజీలు), శ్రీ హర్ష మిత (60 కేజీలు) రజతాలను గెలుచుకున్నారు. రోషిణి (59 కేజీలు), హర్ష మిత (59 కేజీలు), గాయత్రి (55 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు