నేను ప్రాధేయపడ్డా.. సవాల్‌ చేశా: సచిన్‌

26 Sep, 2019 13:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ది ప్రత్యేక శకం. ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడంటే అందుకు  ఓపెనర్‌గా సక్సెక్‌ కావడం ప్రధానం కారణం. 1989లో భారత క్రికెట్‌లోకి అడుగపెట్టిన సచిన్‌.. 1994లో ఆక్లాండ్‌లో  జరిగిన మ్యాచ్‌ ద్వారా ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు సచిన్‌. తాను ఓపెనర్‌గా రావడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఎలా ఒప్పించాడనే విషయాన్ని సచిన్‌  తాజాగా గుర్తు చేసుకున్నాడు.

తాను ఓపెనర్‌గా రావడానికి ఎంతగానో ప్రాధేయపడ్డానని, అదే సమయంలో మేనేజ్‌మెంట్‌తో వాదనకు దిగానని చెప్పుకొచ్చాడు.  ఈ మేరకు లింక్‌డిన్‌లో ఒక వీడియోను షేర్‌ చేసిన సచిన్‌.. తాము  సక్సెస్‌ అవుతామనుకునే ఫీల్డ్‌లో రిస్క్‌ చేయడానికి వెనుకంజ వేయొద్దని  అభిమానులకు సూచించాడు. ‘ విఫలం అవుతామనే భయం ఎప్పటికీ వద్దు. నీవు సక్సెస్‌ అవుతాను అనుకుంటే కచ్చితంగా అందుకోసం రిస్క్‌ చేయి. రిస్క్‌ చేయపోతే ముందుకు వెళ్లడం కష్టం. అందుకు నేనొక ఉదాహరణ. నేను ఓపెనర్‌గా చేయడానికి భయపడలేదు.  నాకిష్టమైన ఓపెనింగ్‌ విభాగంలో  బ్యాటింగ్‌కు చేయడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఎంతో  వేడుకున్నా. వారితో వాదించి మరీ ముందుకు  వెళ్లా. 25 ఏళ్ల క్రితం నాటి ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను ఓపెనర్‌గా దిగుతానని పట్టుబట్టా. ఒకవేళ నేను ఓపెనర్‌గా సక్సెస్‌ కాలేకపోతే మళ్లీ ఎప్పుడూ మిమ్మల్ని అడగనని మరీ వారికి సవాల్‌ చేశా. అదే  నా సక్సెస్‌కు కారణం. భయపడితే విజయాలు రావు. విఫలం అవుతాననే భయం వద్దు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు