జూనియర్ బాలికల విజేత శ్రీజ

1 Nov, 2014 01:07 IST|Sakshi
జూనియర్ బాలికల విజేత శ్రీజ

ఈస్ట్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టీటీ

 సాక్షి, హైదరాబాద్: ఈస్ట్ జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె జూనియర్ బాలికల విభాగంలో టైటిల్ చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రీజ 4-1 గేమ్‌ల తేడాతో కేరళకు చెందిన మరియా రోనిపై విజయం సాధించింది. ఆమె 7-11, 14-12, 11-9, 11-4, 11-7తో ప్రత్యర్థిని కంగుతినిపించింది.  గ్లోబల్ టీటీ అకాడమీ ప్లేయర్ అయిన శ్రీజ ఫైనల్ మధ్యలో చేతి గాయంతో ఇబ్బంది పడింది.

అయితే చికిత్స అనంతరం కోలుకున్న ఆమె, మ్యాచ్‌ను కొనసాగించి విజేతగా నిలవడం విశేషం. సెమీస్‌లో ఆమె 11-9, 12-10, 5-11, 11-7, 13-11తో హైదరాబాదీ అమ్మాయి నైనా జైస్వాల్‌ను ఇంటిదారి పట్టించింది. క్వార్టర్స్‌లో ఆమె 11-7, 10-12, 11-9, 8-11, 11-6తో దీప్తి సెళ్వకుమార్ (తమిళనాడు)పై విజయం సాధించింది. శ్రీజ విజయంపై జీటీటీఏ కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ టీటీ సంఘం కార్యదర్శి ప్రకాశ్ రాజు ఆమెపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వార్తలు