ఇక ఆగదు ఏ మ్యాచ్‌!

5 Oct, 2017 03:03 IST|Sakshi

వర్షం వచ్చినా... సాగే క్రికెట్‌  

లండన్‌: వర్షార్పణమయ్యే మ్యాచ్‌లకు చెల్లుచీటి లభించనుంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్టేడియాన్ని మొత్తం కప్పేసే కనోపీ (పైకప్పు)లతో నవీకరించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా పారదర్శకంగా కనిపించే మెష్‌ను అత్యంత పటిష్టమైన వైరింగ్‌ సాయంతో కప్పేస్తారు. ‘కొత్త సాంకేతికత మమ్మల్ని ఆకర్షిస్తోంది.

మ్యాచ్‌లు వర్షం బారిన పడకుండా ఉండే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చూస్తున్నాం’ అని ఎంసీసీ సీఈఓ గయ్‌ లావెండర్‌ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో చేసిన కనోపీలను త్వరలోనే పరీక్షిస్తామని, ఈ మేరకు ఈసీబీ వర్గాలతో చర్చించామని ఆయన చెప్పారు. ఈ పరీక్షలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన కంపెనీ ఇప్పటికే ఈసీబీతో కలిసి పనిచేయనుందని తెలిసింది. 

మరిన్ని వార్తలు