'ఆట' మరచిన ఆంధ్ర!

17 Sep, 2016 00:34 IST|Sakshi
'ఆట' మరచిన ఆంధ్ర!

ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో రకరకాల పదవుల్లో 11 మంది ఉన్నారు. ఇందులో జాతీయ సెలక్టర్ కూడా ఒకరు. ఇక ఏసీఏ పరిధిలో అద్భుతమైన స్టేడియాలు, అకాడమీలు ఉన్నాయి. శభాష్... ఆంధ్ర క్రికెట్ ‘వెలిగిపోతోంది’.... ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం.
 
పదవులు, స్టేడియాల సంగతి సరే... మరి ఆట సంగతేంటి..? ఒక్కరంటే ఒక్కరన్నా జాతీయ జట్టు దరిదాపుల్లో ఉన్నారా..? లక్షల రూపాయలు పోసి అరువు సీనియర్లను తెచ్చుకున్నా రంజీ జట్టు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా ఎందుకు తయారవుతోంది.

 
పదవులు, స్టేడియాలతోనే హడావిడి
* ఏ మాత్రం పెరగని క్రికెట్ ప్రమాణాలు
* జాతీయ జట్టుకు ఆడే ఆంధ్రా క్రికెటరే లేడా..?

సాక్షి, విజయవాడ స్పోర్స్ట్ : ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా మేం మంచి స్టేడియం కట్టాము. మంచి సౌకర్యాలు కల్పించాం. అయితే నాకేమీ సంతోషంగా లేదు. నా రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు భారత్‌కు ఆడుతుంటేనే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది’... ఇటీవల విజయవాడ సమీపంలోని మూలపాడు వద్ద క్రికెట్ స్టేడియాల ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య ఇది. అంటే ఓ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనం ఆటగాళ్లు తయారు కావడం. కానీ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మాత్రం దీనిని ఇంకా గ్రహించినట్లు లేదు.
 
ప్రతి జిల్లాలో ఓ క్రికెట్ గ్రౌండ్... కొత్తగా టెస్టు హోదా...  ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ వసతి, రెసిడెన్షియల్ అకాడమీ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థారుులో స్టేడియాల అభివృద్ధి జరగలేదని ఏసీఏ చెప్పుకుంటోంది. బీసీసీఐ ఇచ్చిన నిధులతో గత కొన్నేళ్లలో ఏసీఏలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి బాగా జరిగిందనడంలో సందేహం లేదు. ఇక పదవుల సంగతి సరేసరి. ఏకంగా 11 మంది ఏసీఏ నుంచి బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలో ఉన్న ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు మార్కెటింగ్, ఐటీ, ఫిక్చర్స్‌కమిటీల్లో కూడా సభ్యులు. ఇక ఏసీఏకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్టర్‌గా వ్యవహరించారు.

తాజాగా ఆయన పదవీకాలం పూర్తయింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇన్ని సౌకర్యాలు, ఇంత అధికారం ఉన్న క్రికెట్ సంఘం నుంచి జాతీయ జట్టుకు, కనీసం ‘ఎ’ జట్టుకు ఆడే ఆటగాళ్లు కూడా కనపడటం లేదు. ఐపీఎల్‌లోనూ ఏ జట్టులోనూ తుది జట్టులో ఆంధ్ర క్రికెటర్ ఆనవాళ్లే లేవు. ఈ స్థితిని మార్చడానికి మాత్రం ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఆటను పట్టించుకోవడం మానేశారు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి.
 
పదేళ్ల క్రితం వరకూ ఆంధ్ర క్రికెట్‌లో ఆటగాళ్లు బాగానే ఉండేవారు. ఎప్పుడు సౌత్‌జోన్ జట్టు ఎంపిక జరిగినా కనీసం ఇద్దరు, ముగ్గురు ఆడేవారు. ‘ఎ’ జట్టు స్థాయికి కూడా ఆడారు. కానీ ఆ తర్వాత క్రమంగా వైభవం పోయింది. అండర్-19లో రికీ భుయ్ తప్ప మరో ఆటగాడు వెలుగులోకి రాలేదు. ’మా దగ్గర కొందరు పెద్దలకు అభద్రతా భావం ఎక్కువ. ఎవరికీ పేరు రాకూడదని,  నేను తప్ప ఇంకెవరూ కనిపించకూడదనే ఆలోచనా ధోరణి కారణంగా ఈ స్థితి ఏర్పడింది’ అని ఏసీఏ సభ్యుడు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఏసీఏలో పదవులు అనుభవించేవారిలో మెజారిటీ సభ్యులకు రంజీ జట్టులో ఉండే క్రికెటర్లందరి పేర్లు కూడా తెలియవంటే అతిశయోక్తి కాదు. గత ఎనిమిదేళ్లలో ఒక్క సీజన్‌లో మాత్రమే ఆంధ్ర రంజీ జట్టు ఎలైట్ గ్రూప్‌కు వెళ్లింది. కానీ ఒక్క ఏడాదిలోనే మళ్లీ ప్లేట్ ‘సి’ గ్రూప్‌కు పడిపోయింది. ‘కై ఫ్, మజుందార్ లాంటి సీనియర్ క్రికెటర్లను 25 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆడించారు. కానీ ప్రయోజనం లేదు. ఫిజియోలు, కోచ్‌లు అందరూ బయటివారే. మన దగ్గర ఉన్న టాలెంట్‌ను గుర్తించడం లేదు. వేణుగోపాలరావును ఆడించకపోవడం దీనికి ఉదాహరణ. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడేవాళ్లంటే మా వాళ్లకు ఇష్టం.

తెలుగు రాని వాళ్లు, తెలుగు మాత్రమే తెలిసిన ఆటగాళ్లకు ఏం కమ్యూనికేట్ చేస్తారని కూడా ఆలోచించడం లేదు’ అని మరో సభ్యుడు వాపోయారు. ఏసీఏలో ఎక్కువ మంది సభ్యులకు పదవులు, ఏ అవకాశం దొరికినా మేనేజర్‌గానో, మరో రూపంలో విదేశీ పర్యటన అవకాశాలు... ఇలా ఏదో ఒక తారుులాలు లభిస్తుండటంతో ఎవరూ సంఘంలో జరిగే విషయాలను ప్రశ్నించడం లేదు. నిజానికి ప్రశ్నించే వాళ్లు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏసీఏలో లోపించిందే అది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కాలం రంజీ జట్టు ప్లేట్‌లోనే ఉంటుంది... నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అరువు ఆటగాళ్లతో సీజన్‌ను అలా గడిపేయడమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం.
 
మనవాళ్లు పనికిరారా..?
2010లో ఎం.ఎస్.కె. ప్రసాద్ ఏసీఏలో క్రికెట్ ఆపరేషన్‌‌స డెరైక్టర్‌గా పదవి చేపట్టారు. గత ఏడాది ఆయనకు బీసీసీఐ సెలక్టర్‌గా అవకాశం లభించింది. దాంతో  ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. అయితే మనవాళ్లు ఎవరూ పనికి రారంటూ కింజల్ సూరత్‌వాలా అనే వ్యక్తిని ముంబై నుంచి పిలిపించి ఈ పదవిలో కూర్చోబెట్టారు. నెలకు రూ. 3 లక్షల జీతం తీసుకుంటున్న ఈయన నిజానికి వృత్తి రీత్యా డాక్టర్. యూనివర్శిటీ స్థాయిలో ఆడాడని చెప్పుకుంటారు కానీ ఒక రాష్ట్ర జట్టు ఆపరేషన్‌‌స చూసే స్థాయిలో  క్రికెట్ పరిజ్ఞానం లేదు. గతంలో జాతీయ క్రికెట్ అకాడమీలో స్పోర్‌‌ట్స సైన్‌‌స హెడ్‌గా పని చేశారు.

ఒక వైపు భాషా సమస్యను అధిగమిస్తూ ఈ ఏడాది కాలంలో ఏం పని చేశారో కూడా ఏసీఏలోనే చాలా మందికి తెలియదు.  ‘మా వాళ్లకు ఆటగాళ్లే కాదు... పరిపాలనలోనూ అరువు వాళ్లను తెచ్చుకోవడమే ఇష్టం. ఇక్కడ ఎవరికై నా ఆ పదవి ఇస్తే అవసరమైన సమయంలో మళ్లీ ఎమ్మెస్కేను డెరైక్టర్ చేయలేమని వారి భయం. అందుకే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు సెలక్టర్‌గా ప్రసాద్ పదవీకాలం పూర్తరుుంది. కాబట్టి సూరత్‌వాలాను పంపించి, ప్రసాద్‌ను ఆ స్థానంలో కూర్చోబెడతారు’ అని ఏసీఏలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి చెప్పటం విశేషం.

మరిన్ని వార్తలు