భారత జట్ల బోణీ 

22 May, 2018 00:53 IST|Sakshi
వైష్ణవి

ఆస్ట్రేలియాపై పురుషుల, మహిళల జట్ల విజయం

థామస్‌–ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక థామస్‌–ఉబెర్‌ కప్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాల బోణీ చేశాయి. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 5–0తో క్లీన్‌స్వీప్‌ చేయగా... ఆస్ట్రేలియాతోనే జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–1తో గెలుపొందింది. పురుషుల విభాగం తొలి మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–19, 21–13 తో ఆంటోని జొయ్‌పై నెగ్గాడు. డబుల్స్‌ మ్యాచ్‌ లో అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జంట 21–11, 21–15తో మాథ్యూ చావు–సావన్‌ సెరాసింఘే జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో సాయి ప్రణీత్‌ 21–9, 21–6తో జాకబ్‌ స్కెలెర్‌పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో అరుణ్‌ జార్జి–సాన్యమ్‌ శుక్లా జోడీ 21–16, 20–22, 21–8తో సిమాన్‌ వింగ్‌ హంగ్‌–రేమండ్‌ టామ్‌ ద్వయంపై నెగ్గింది. ఐదో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21–5, 21–14తో కయి చెన్‌ తెహ్‌పై గెలిచాడు. మంగళవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో భారత్‌ ఆడుతుంది.  

వైష్ణవి, సైనా విజయం: మహిళల విభాగం తొలి సింగిల్స్‌లో సైనా 21–14, 21–19తో చెన్‌పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో మేఘన– పూర్వీషా రామ్‌ జం ట 13–21, 16–21తో గ్రోన్యా సోమర్‌విల్లె–రెనుగా వీరన్‌ జోడీ చేతిలో ఓడింది. దీంతో 1–1తో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. మూడో మ్యాచ్‌లో వైష్ణవి రెడ్డి 21–17, 21–13తో జెన్నిఫర్‌ టామ్‌పై గెలుపొంది భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో సంయోగిత–ప్రాజక్తా జంట 21–19, 21–11తో లౌసా మా–అన్‌ లౌసి స్లీపై గెలిచి 3–1తో భారత విజయాన్ని ఖాయం చేసింది. ఐదో మ్యాచ్‌లో అనురా 21–6, 21–7తో జెసిలీపై నెగ్గి భారత్‌ను 4–1తో గెలిపించింది. బుధవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది.    

మరిన్ని వార్తలు