భారత్ విజయానికి బాట వేస్తాం

14 May, 2014 00:29 IST|Sakshi

జ్వాల-అశ్విని జోడి వ్యాఖ్య
 న్యూఢిల్లీ: ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రాణిస్తామని భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప తెలిపారు. ఈ టీమ్ ఈవెంట్‌లో భారత్ విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. డబుల్స్‌లో తప్పక గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల విభాగంలో ఉబెర్ కప్, పురుషుల విభాగంలో థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలు ఈ నెల 18 నుంచి ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. ‘డబుల్స్‌లో మాపై భారీ అంచనాలు ఉన్నాయి. మా శక్తి మేర రాణిస్తాం. భారత్ గెలిచేందుకు దోహదపడే విజయాన్ని అందిస్తాం. వ్యక్తిగత ఈవెంట్ కంటే టీమ్ ఈవెంట్ భిన్నమైంది.
 
 జట్టు కోసం ఆడుతున్నప్పుడు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. భారత్ గెలవాలనే లక్ష్యంతో మేమంతా బరిలోకి దిగుతాం’ అని గుత్తాజ్వాల పేర్కొంది. ఈమెకు ఉబెర్‌కప్‌లో విశేషమైన అనుభవముంది. తన పదహారో యేటే 2000లో ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఈమె భాగస్వామి అశ్విని మాట్లాడుతూ ‘వ్యక్తిగత టోర్నీలు దేశం తరఫునే ఆడతాం. కానీ అవి మా కోసం మేం ఆడతాం. అక్కడ పెద్దగా ఒత్తిళ్లు ఉండవు. కానీ టీమ్ ఈవెంట్లలో మాత్రం అలా కాదు. ఎవరికి వారు బాగా ఆడటం కాదు, అందరూ అన్ని విభాగాల్లో రాణించేందుకు కష్టపడాలి. అప్పుడే జట్టుకు ఫలితం వస్తుంది’ అని తెలిపింది.
 

మరిన్ని వార్తలు