‘మేము ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లం’

3 Jun, 2020 19:52 IST|Sakshi

ఆంటిగ్వా: వచ్చే నెలలో ఇంగ్లండ్‌ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తాము ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లలేమని ముగ్గురు విండీస్‌ ప్రధాన క్రికెటర్లు తేల్చిచెప్పారు. షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌, కీమో పాల్‌, డారెన్‌ బ్రావోలు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లలేమని విండీస్‌ బోర్డుకు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర ప్రభావం చూపుతున్నందున తాము ఇంగ్లండ్‌కు పర్యటనకు దూరంగా ఉండదల్చుకున్నామన్నారు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా విండీస్‌ ఇటీవల 25 మందితో కూడిన జట్టును సిద్ధం చేసింది. అయితే ఆ పర్యటనకు 14 మందితో ఉన్న జట్టును ప్రకటించగా అందులో వీరు ముగ్గురూ ఉన్నారు. (క్రికెట్‌ ప్రపంచం గళం విప్పాల్సిందే)

అయితే ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లబోమని విషయాన్ని తాజాగా తెలిపినట్లు విండీస్‌ క్రికెట్‌ బోర్డు(సీడబ్యూఐ) స్పష్టం చేసింది. వీరి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మరో 11 మంది రిజర్వ్‌ ఆటగాళ్లు ఉన్నందున తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనే ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సిరీస్‌లో జూన్‌లోనే జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడటంతో క్రికెట్‌ పునరుద్దరణకు ఇంగ్లండ్‌ చేసిన ప‍్రయత్నాలు ఫలించాయి. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్‌ బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి ఆటగాళ్లను, సిబ్బందిని రప్పించడం, వారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం వంటి తదితర అంశాలపై సభ్యులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.(‘అది కోహ్లికి ఆక్సిజన్‌లా పనిచేస్తుంది’)

మరిన్ని వార్తలు