గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు: తివారి

26 Oct, 2015 02:32 IST|Sakshi
గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు: తివారి

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బెంగాలీల గురించి ఢిల్లీ సారథి గౌతమ్ గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారి ఆరోపించాడు. అలా చేయడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందన్నాడు. ‘గంగూలీ, బెంగాలీల గురించి గౌతీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దాదాతో మాట్లాడా. అనవసరంగా అతని పేరును లాగుతున్నారని సౌరవ్ బాధపడ్డారు. అయితే గంగూలీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మేం సహించం. గంభీర్ ఎలాగూ నిజం చెప్పడు. అతను చెబుతున్నట్లు నేనే గనుక తప్పు చేస్తే నాకెందుకు 40 శాతమే జరిమానా పడుతుంది.

గంభీర్ తప్పు చేశాడో లేదో అతనికి విధించిన 70 శాతం జరిమానాను చూస్తే తెలిసిపోతుంది’ అని తివారి వెల్లడించాడు. స్లెడ్జింగ్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పిన తివారి, వేరొకరి తల్లిని దూషించడం సరైంది కాదన్నాడు. మరోవైపు మనోజ్ తివారి ఆరోపణలను గంభీర్ ఖండించాడు.  తివారి దిగజారి మాట్లాడుతున్నాడని, తానెప్పుడూ గంగూలీని విమర్శించలేదని గంభీర్ వివరించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు మాని... తివారి ఆటపై దృష్టి పెట్టాలని గంభీర్ హితవు పలికాడు.

మరిన్ని వార్తలు