సింధు, సైనాలపై దృష్టి 

18 Sep, 2018 01:11 IST|Sakshi

 నేటి నుంచే చైనా ఓపెన్‌ టోర్నీ  

చాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ చైనా ఓపెన్‌పై కన్నేశారు. రెండేళ్ల క్రితం (2016) ఇక్కడ విజేతగా నిలిచిన సింధు ఈసారీ టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే చైనా ఓపెన్‌లో 23 ఏళ్ల సింధు మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. జపాన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌... డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సాత్విక్‌ సాయిరాజ్, ప్రణవ్‌ చోప్రా, సుమీత్‌ రెడ్డి, మను అత్రి ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.

ఈ ఏడాది జోరు మీదున్న సింధు పాల్గొన్న ప్రతీ మేజర్‌ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. గత వారం జరిగిన జపాన్‌ ఓపెన్‌లో మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సింధు... చెంగ్‌ ఎన్గన్‌ యి (హాంకాంగ్‌)తో తలపడనుండగా, 2014 చైనా ఓపెన్‌ విజేత అయిన సైనాకు సుంగ్‌ జీ హున్‌ (కొరియా) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఏషియాడ్‌ రన్నరప్‌ సింధు, కాంస్య విజేత సైనాలు ప్రిక్వార్టర్స్‌ దశ దాటితే... క్వార్టర్‌ ఫైనల్స్‌ వీళ్లిద్దరి మధ్యే జరుగుతుంది.  

మరిన్ని వార్తలు