కివీస్‌ సన్నాహాలకు వేళాయె...

17 Oct, 2017 04:27 IST|Sakshi

నేడు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

ముంబై: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో నేడు తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని కివీస్‌ ఇక్కడి పిచ్‌ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్‌ను చక్కగా వినియోగించుకోవాలని భావిస్తోంది. సీనియర్‌ ఆటగాళ్లు రాస్‌ టేలర్, మార్టిన్‌ గప్టిల్‌ కూడా సిరీస్‌కు ముందు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించాలని చూస్తున్నారు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బోర్డు ఎలెవన్‌లో కరుణ్‌ నాయర్, రిషభ్‌ పంత్, పృథ్వీ షా తమ సత్తా చూపించి సెలక్టర్ల దృష్టిలో పడే ఆలోచనలో ఉన్నారు. బౌలింగ్‌ విభాగం కూడా కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పైచేయి సాధించాలని చూస్తోంది.

ఇటీవలి కాలంలో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్న భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవాలంటే తమ ఓపెనర్లు లాథమ్, గప్టిల్‌ శుభారంభం అందించాలనే అభిప్రాయంతో కివీస్‌ కోచ్‌ మైక్‌ హెన్సన్‌ ఉన్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై వీరు పరుగుల వరద పారిస్తే జట్టుకు మంచిదే. అయితే సీనియర్‌ బౌలర్లు లేని బోర్డు జట్టులో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌... అంతగా అనుభవం లేని బౌలర్లు ధావల్‌ కులకర్ణి, ఉనాద్కట్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. భారత వన్డే జట్టు లో చోటు దక్కని∙లోకేశ్‌ రాహుల్‌ను ఈ రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల కోసం సోమవారం ఎంపిక చేశారు.
 
జట్లు: బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, శివమ్‌ చౌదరి, కరుణ్‌ నాయర్, గుర్‌కీరత్‌ మన్, మిలింద్‌ కుమార్, రిషభ్‌ పంత్, షాబాజ్‌ నదీమ్, కరణ్‌ శర్మ, ధావల్‌ కులకర్ణి, ఉనాద్కట్, అవేశ్‌ ఖాన్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), టాడ్‌ ఆస్టల్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, గప్టిల్, హెన్రీ, లాథమ్, నికోల్స్, మిల్నే, ఫిలిప్స్, సాన్‌ట్నర్, సౌతీ, టేలర్, మున్రో, వర్కర్‌.  

మరిన్ని వార్తలు