ఒలింపిక్స్‌ రీషెడ్యూల్‌ ఇదే..

30 Mar, 2020 18:32 IST|Sakshi

టోక్యో: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తాజాగా దానికి సంబంధించిన రీషెడ్యూల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది జూలై నెలలో ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నట్లు ఐఓసీ స్పష్టం చేసింది. ఈ మేరకు  టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులతో సోమవారం సుదీర్ఘంగా చర్చించిన ఐఓసీ.. ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వచ్చే ఏడాది(2021) జూలై 23వ తేదీ నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న విషయాన్ని ఐఓసీ తెలిపింది. జూలై చివరి వారంలో ఆరంభమయ్యే ఈ మెగా క్రీడా సంబరం ఆగస్టు 8వ తేదీన ముగియనుంది. 

కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను ముందుగా రద్దు చేశారు. ఇటీవల ఈ ఏడాది ఒలింపిక్స్‌ను రద్దు చేసిన ఐఓసీ.. ఏడాది పాటు వాయిదానే సరైనది భావించింది. మరొకవైపు 2021 ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్‌5 వరకూ పారా ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఒలింపిక్స్‌ సభ్య దేశాలన్ని ముక్త కంఠంతో ఒలింపిక్స్‌ను రద్దు లేదా వాయిదా వేయాలని కోరడంతో ఐఓసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్‌–2020ను ఏడాది పాటు వాయిదా వేయాలని జపాన్‌ దేశ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సంయుక్తంగా నిర్ణయించిన తర్వాతే రీషెడ్యూల్‌కు వెళ్లారు. 

ఈ అర్హత సరిపోద్ది..
టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్‌ కోసం వివిధ క్రీడాంశాల్లో అర్హత సాధించిన వారికి ఊరట లభించింది. ఇప్పటివరకూ అర్హత సాధించిన అథ్లెట్లు మళ్లీ క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఆడాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.  2020 ఒలింపిక్స్‌ కోసం వివిధ క్రీడాంశాల్లో కలిపి ఇప్పటికే 57 శాతం మంది అర్హత సాధించారు. అయితే క్రీడలు ఏడాది కాలం పాటు వాయిదా పడటంతో వీరి అర్హతపై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో పలువురు అథ్లెట్లు తమ కెరీర్‌ చరమాంకంలో ఉండటంతో పాటు సంవత్సరం పాటు తమ ఫిట్‌నెస్‌ను, ఆటను అదే స్థాయిలో కొనసాగిస్తూ మళ్లీ క్వాలిఫయింగ్‌ పోటీల్లో పాల్గొని అర్హత సాధించడం అంటే దాదాపుగా అసాధ్యమే! ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.(‘నేను చ‌నిపోతే నా పిల్ల‌లు ఇది తెలుసుకోవాలి’)

మరిన్ని వార్తలు