ఒలింపిక్స్‌ టెన్నిస్‌ అర్హత తేదీల ప్రకటన

10 Jun, 2020 01:07 IST|Sakshi

లండన్‌: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ ఈవెంట్‌ అర్హత వివరాలను అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ప్రకటించింది. జూన్‌ 7, 2021 అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ), మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఎంట్రీలను ఖరారు చేస్తామని ఐటీఎఫ్‌ తెలిపింది. 64 మందితో కూడిన పురుషుల, మహిళల సింగిల్స్‌ ‘డ్రా’లో టాప్‌–56 ర్యాంకింగ్స్‌ క్రీడాకారులు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా ఎనిమిది బెర్త్‌లలో ఆరు కాంటినెంటల్‌ క్వాలిఫయింగ్స్‌ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా రెండు బెర్త్‌లు రిజర్వ్‌లో ఉంటాయి. డబుల్స్‌లో 32 జోడీలకు అవకాశం ఇస్తారు. టాప్‌–10 జోడీలకు నేరుగా ఎంట్రీ ఉంటుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 16 జోడీలు బరిలోకి దిగుతాయి. సింగిల్స్, డబుల్స్‌లలో అర్హత పొందిన ఆటగాళ్లతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రతి దేశం నుంచి గరిష్టంగా నలుగురు మాత్రమే పోటీపడే వీలుంది. టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.

మరిన్ని వార్తలు