అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌

3 May, 2020 01:56 IST|Sakshi
నరీందర్‌ బాత్రా

ఐఓసీ సభ్యుడు నరీందర్‌ బాత్రా స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రీషెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కచ్చితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యుడు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా స్పష్టం చేశారు. శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్‌ అమల్లోకి వచ్చాకే విశ్వ క్రీడలు నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలతో నెలకొన్న సందిగ్ధతను ఆయన సమావేశంలో దూరం చేశారు.

‘టోక్యో క్రీడలపై రోజుకో రకంగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఏది ఏమైనా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ జరుగుతాయి. విశ్వ క్రీడలకు సంబంధించిన ముఖ్య వ్యక్తులతో నేను తరచుగా మాట్లాడుతున్నా. వదంతులకు ప్రాధాన్యతనివ్వకండి. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లలో కరోనా చికిత్స భారత్‌లో అందుబాటులోకి రావొచ్చు. కాబట్టి ఒలింపిక్స్‌ జరుగుతాయనే మానసిక సన్నద్ధతతో ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు