టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది: డివిలియర్స్‌

25 Dec, 2017 04:04 IST|Sakshi

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి సేన కొత్త చరిత్రను లిఖిస్తుందని స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. పోరాటతత్వానికి మారుపేరైన విరాట్‌ కోహ్లి సారథ్యంలో భారత్‌ టెస్టు సిరీస్‌ కచ్చితంగా గెలిచేందుకే ప్రయత్నిస్తుందని అన్నాడు. ‘ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవలేదు. 2011లో 1–1తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇదే వారి అత్యుత్తమ ప్రదర్శన. కానీ కొంత కాలంగా భారత జట్టులో, కోహ్లిలో గణనీయమైన మార్పు కనబడుతోంది. యువకులతో నిండిన ఈ జట్టు ఎదురులేకుండా దూసుకెళ్తోంది.

ఈసారి సఫారీ గడ్డపై కచ్చితంగా తమ రికార్డును తిరగరాస్తారు. భారత్‌తో ఆడటం మాకు ఇప్పుడు పెద్ద సవాల్‌’ అని 33 ఏళ్ల డివిలియర్స్‌ అన్నాడు. ప్రస్తుత తరంలో ఉన్న గొప్ప కెప్టెన్లలో విరాట్‌ ఒకడని కితాబిచ్చాడు. కెరీర్‌ ప్రారంభంలో ఉన్న కోహ్లికి ఇప్పటి కోహ్లికి చాలా వ్యత్యాసం ఉందని బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టులో తన సహచరుడైన కోహ్లిపై డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. 2016 జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు తర్వాత గాయంతో ఈ ఫార్మాట్‌కు దూరమైన డివిలియర్స్‌ మంగళవారం నుంచి జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌తో టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు.   

మరిన్ని వార్తలు