డైలమాలో అక్మల్‌ కెరీర్‌..!

22 Mar, 2020 14:06 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌ కెరీర్‌ డైలమాలో పడింది.  మ్యాచ్ ఫిక్సింగ్‌ కోసం బుకీలతో అక్మల్‌ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనిపై ఇటీవల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్మల్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున ఉమర్ అక్మల్‌‌కు పీసీబీ నోటీసులు జారీ చేసింది.(ఉమర్‌.. మా డబ్బులు మాకిచ్చేయ్‌!)

మ్మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్‌ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే.. అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.

గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్‌ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే అక్మల్‌పై తాత్కాలిక నిషేధం విధించడంతో పీఎస్‌ఎల్‌కు అక్మల్‌ దూరమయ్యాడు. 

మరిన్ని వార్తలు