యూకేలో శిక్షణకు టీఎస్‌ఎస్‌ఎస్‌ అథ్లెట్లు

17 Mar, 2018 10:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌)కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు గొప్ప అవకాశం లభించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని లాబరో యూనివర్సిటీ అందించే అత్యుత్తమ అథ్లెటిక్స్‌ శిక్షణకు వీరు ఎంపికయ్యారు. టీఎస్‌ఎస్‌ఎస్‌లో ఇంటర్‌ చదువుతోన్న వై. హరికృష్ణ, కె. అరవింద్, పదో తరగతి విద్యార్థిని డి. భాగ్యలక్ష్మి ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వీరు ఇటీవలే జరిగిన టాటా టీ జాగోరే ‘జాతీయ అథ్లెటిక్స్‌’లో మెరుగైన ప్రతిభ కనబరిచి ఈ శిక్షణకు అర్హత సాధించారు.

యూకేలో ఏప్రిల్‌లో 8 రోజుల పాటు కోచింగ్‌ క్యాంపు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12 మంది అథ్లెట్లు ఈ క్యాంపునకు ఎంపికవగా టీఎస్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులే ముగ్గురు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా టీఎస్‌ఎస్‌ఎస్‌ ఓఎస్డీ కె. నర్సయ్య, అథ్లెటిక్స్‌ కోచ్‌ పీబీ ఆదిత్య, క్రీడాధికారి ఆర్‌కే బోస్‌ విద్యార్థులను అభినందించారు.  

మరిన్ని వార్తలు