సాక్షి, విజయవాడ: వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత పోలీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య రజత పతకం సాధించాడు. చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో విజయవాడ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తులసీ చైతన్య 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ కేటగిరీలో రెండో స్థానాన్ని సంపాదించాడు. చైతన్య 1ని:07.96 సెకన్లలో గమ్యానికి చేరి రజతాన్ని దక్కించుకున్నాడు. లో టింగ్ ఫంగ్ (హాంకాంగ్–1ని:06.83 సెకన్లు) స్వర్ణం సాధించగా... గువో యిలిన్ (చైనా–1ని:08.93 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నాడు. ప్రపంచ పోలీసు క్రీడల్లో రజతం సాధించిన సందర్భంగా చైతన్యను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారక తిరుమలరావు, అడిషనల్ డీజీ (స్పోర్ట్స్) శ్రీధర్ అభినందించారు.