బీసీసీఐ పై అభిమానుల ఆగ్రహం

8 Mar, 2018 20:01 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలను భారీగా పెంచిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపులో పురుష, మహిళా క్రికెటర్లకు వ్యత్యాసం చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత పురుషుల క్రికెటర్లకు కోట్లలో వార్షిక వేతనం ఉండగా.. మహిళా క్రికెటర్లకు లక్షల్లో ఉండటం ఏమిటని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్లుకు ఇచ్చిన కానుక ఇదేనా? అని నిలదీస్తున్నారు. దేశం తరుఫున ఇరు జట్లు అద్బుతంగా రాణిస్తున్నా జీతాల్లో ఇంత వ్యత్యాసం ఏమిటో ప్రశ్నించండి అని ఒకరంటే.. షేమ్‌ బీసీసీఐ.. మహిళా టాప్‌ క్రికెటర్ల జీతాలు పురుషుల సీ గ్రేడ్‌ ఆటగాళ్ల వేతనాల్లో సగం ఉండటం సిగ్గుచేటని మరోకరు ట్రోల్‌ చేస్తున్నారు. పురుషుల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి రూ 7 కోట్లు వస్తే మహిళా జట్టు కెప్టెన్‌కు మరి రూ. 50 లక్షలా అని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇక భారత పురుషుల క్రికెటర్ల జీతాలు ఏ+ గ్రేడ్‌- రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్‌- రూ. 2 కోట్ల నుంచి 5 కోట్లు, బీ గ్రేడ్‌ - రూ.1 కోటి నుంచి 3 కోట్లు, సీ గ్రేడ్‌- రూ. 50 లక్షల నుంచి 1 కోటి మేర పెంచారు. ఇటీవల మహిళా క్రికెటర్ల అద్బుతంగా రాణించడంతో అభిమానుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి జీతాలు కూడా భారీగా పెరుగుతాయని అందరు భావించారు. కానీ బీసీసీఐ మహిళా దినోత్సవం నాడే మహిళా క్రికెటర్లకు మొండి చెయ్యి చూపించింది.

జీతాలు పెంచిన అవి పురుష క్రికెటర్లతో పోల్చితో చాలా తక్కువ. భారత మహిళా క్రికెటర్ల వార్షిక వేతనాలు.. గ్రేడ్‌ ఏ- 50 లక్షలు, గ్రేడ్‌ బీ- 30 లక్షలు, గ్రేడ్‌ సీ -10 లక్షలుగా ప్రకటించారు. ఈ వార్షిక వేతనాల వ్యత్యాసం మరీ ఇంతగా ఉండటం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తోంది. 

మరిన్ని వార్తలు