ఇది మ్యాచ్‌ చేంజింగ్‌ నిర్ణయం..!

17 Dec, 2018 10:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి రికార్డు సెంచరీ సాధించి పలు రికార్డులను నమోదు చేశాడు. అయితే 93వ ఓవర్లో కమిన్స్‌ బౌలింగ్‌లో కోహ్లి షాట్‌కు యత్నించగా సెకండ్‌ స్లిప్‌లో హ్యాండ్స్‌కాంబ్‌ క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ వివాదాస్పదంగా మారింది. కోహ్లి ఔట్‌పై పలు కోణాల్లో చూసినా అది కచ్చితమైన ఫలితం ఏంటనేది తేలలేదు.  ఇటువంటి పరిస్థితుల్లో బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌మన్‌కే అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలి. ఇందుకు విరుద్ధంగా కోహ్లిని ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

కోహ్లిని ఔట్‌గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ నైగెల్ లాంగ్ తీసుకున్న నిర్ణయాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోన్నా ఔట్ ఎలా ఇస్తారంటూ లాంగ్‌పై మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ. కోహ్లి ఔట్ వివాదంపై భారత క్రికెట్ అభిమానులు వరస పెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ‘ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని ఒకరు సెటైర్‌ వేయగా, హ్యాండ్స్‌కాంబ్‌కు క్రీడా స్ఫూర్తి లేదంటూ మరొకరు మండిపడ్డారు. ‘ఇది కచ్చితంగా మ్యాచ్‌ చేంజింగ్‌ నిర్ణయమే’ అని మరొక అభిమాని పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు