ఆరెంజ్‌ జెర్సీ.. స్విగ్గీకి క్రెడిట్‌ ఇవ్వాలి!

29 Jun, 2019 12:19 IST|Sakshi

టీమిండియా అవే జెర్సీపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌ : టీమిండియా అవే జెర్సీపై సోషల్‌ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం కోహ్లిసేనకు ఆరెంజ్‌ కలర్‌లో అవే జెర్సీని నైకీ సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ అవే జెర్సీని శుక్రవారం బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని డిజైన్‌ చేసారు. ఈ డిజైన్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. స్విగ్గీ స్పూర్తితో అవే జెర్సీని డిజైన్‌ చేసినందుకు దానికి తప్పకుండా క్రెడిట్‌ ఇవ్వాలని ఒకరు.. అచ్చం హార్లిక్స్‌ డబ్బాలానే ఉందని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరు భారత్‌ అవే జెర్సీ బాగుందని, మొత్తం దీన్నే కొనసాగించాలంటున్నారు. (చదవండి : రంగు మార్చడం అవసరమా..!)

ఫుట్‌బాల్‌ తరహాలో హోం, అవే మ్యాచ్‌లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్‌ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘హోమ్‌’ టీమ్‌ కావడంతో అదే జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ జెర్సీ రంగుపై రాజకీయంగా దుమారం రేగింది. టీమిండియా ఆరెంజ్‌ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించిన విషయం తెలిసిందే. (చదవండి: టీమిండియా ఆరెంజ్‌ జెర్సీ వెనుక బీజేపీ?)

>
మరిన్ని వార్తలు