ఎదురులేని యు ముంబా

18 Aug, 2015 01:42 IST|Sakshi
ఎదురులేని యు ముంబా

పుణే : ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినప్పటికీ.. ఆద్యంతం దూకుడుగా ఆడిన యు ముంబా జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2లో 12వ విజయాన్ని సాధించింది. పుణేరి పల్టన్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 39-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓడిన యు ముంబా ఈ మ్యాచ్‌లో అనూప్ కుమార్, షబీర్ బాపు, రిశాంక్, మోహిత్ చిల్లార్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది.

రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్లను బరిలోకి దించింది. తొలి అర్ధభాగంలో ముంబాకు గట్టిపోటీనిచ్చిన పుణేరి స్కోరును 13-13తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో ముంబా ఆటగాళ్లు జోరు పెంచారు. పవన్ కుమార్ రైడింగ్‌లో విజృంభించి నిలకడగా పాయింట్లు సాధించడంతో ముంబా జట్టు 36-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పుణేరి తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రస్తుతం యు ముంబా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 45 పాయింట్లతో తెలుగు టైటాన్స్ రెండో స్థానంలో, 43 పాయింట్లతో బెంగళూరు బుల్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.

మరిన్ని వార్తలు