భారత్‌తో ఫిక్సింగ్‌ చేయమన్నారు : పాక్‌ క్రికెటర్‌ 

25 Jun, 2018 08:31 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్‌ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్‌. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారు. అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, ఇలాంటి ఉద్దేశాలతో మరోసారి నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా హెచ్చరించా’’ అని అక్మల్‌ చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం ఐసీసీ, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి.

2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్‌ మహమ్మద్‌ షమీ బౌలింగ్‌ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 107 పరుగులతో చెలరేగిపోయాడు.

మరిన్ని వార్తలు