నెట్‌వర్క్‌ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్‌ పాట్లు!

10 Apr, 2020 16:54 IST|Sakshi
అంపైర్‌ అనిల్‌ ఛౌదురి(ఫైల్‌ఫొటో)

లక్నో: ప్రస్తుత కాలంలో మొబైల్‌ ఫోన్‌ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదేమో. మనం ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్‌ ఫోన్‌ ఉండాల్సిందే. కొందరికైతే చేతిలో ఫోన్‌ లేకపోతే నిమిషం కూడా గడవదు. మరి అంతలా మొబైల్‌ ఫోన్‌కు అతుక్కుపోయే మనం ఒకవేళ సిగ్నల్‌ లేకపోతే ఏం చేస్తాం. ఎక్కడ సిగ్నల్‌ ఉంటుందో అక్కడ తిట్ట వేస్తాం. ఒకవేళ అక్కడ కూడా సరిగ్గా లేకపోతే చెట్టో-పుట్టో పట్టుకుని సిగ్నల్‌ కోసం పాకులాడతాం. ఇలాంటి పరిస్థితి ఎదురైందట భారత క్రికెట్‌ అంపైర్‌ అనిల్‌ ఛౌదురికి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) అంపైర్ల ప్యానల్‌లో సభ్యుడిగా ఉన్న అనిల్‌ ఛౌదురి మొబైల్‌ సిగ్నల్‌ లేక నానా పాట్లు పడ్డాడట. చివరకు చెట్లు కూడా ఎక్కి మొబైల్‌ సిగ్నల్స్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని అంపైర్‌ అనిల్‌ ఛౌదరి స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ కారణంగా ఇటీవల రద్దైన భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు అంపైర్‌గా ఉన్న అనిల్‌ ఛౌదరి.. విరామం రావడంతో తన సొంత ఊరికి వెళ్లాడట. తన పూర్వీకులు ఉంటున్న ఆ గ్రామాన్ని చూశాద్దామని వెళితే.. ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దాంతో చేసేది లేక అక్కడి ఉండిపోవాల్సి వచ్చింది.(ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ అవసరమా?)

వివరాల్లోకి వెళితే..దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డానికి ముందు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని శామ్లీ జిల్లాలోని త‌న స్వ‌గ్రామం  డాంగ్రోల్‌కు వెళ్లిన అనిల్ చౌద‌రి.. అక్క‌డ ఇరుక్కుపోయాడు. ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి వెళ్లిన సదరు అంపైర్‌.. ఢిల్లీలో ఉన్న ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడేందుకు తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ‘మార్చి 16 నుంచి ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి ఇక్క‌డే ఉన్నా.  చాలా రోజులైంది క‌దా అని స్వ‌గ్రామానికి వ‌స్తే లాక్‌డౌన్ కార‌ణంగా ఇక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ నెట్‌వ‌ర్క్ స‌రిగ్గా లేదు. ఢిల్లీలో ఉన్న‌వారితో మాట్లాడాలంటే సిగ్న‌ల్ అంద‌డం లేదు. దీనికోసం ఊరి బ‌య‌ట‌కు కూడా వెళ్లా.. చెట్లు ఎక్కి సిగ్నల్స్‌ పరీక్షించుకున్నా. పొలాల్లోకి వెళ్లినా సిగ్నల్స్‌ రావడం లేదు. ఇంటర్నెట్‌ ద్వారా ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బందే. ఇక్కడ అతి పెద్ద సమస్య నెట్‌వర్క్‌ ’ అని తెలిపాడు. 

మరిన్ని వార్తలు