అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు

20 Jul, 2020 11:06 IST|Sakshi

మాంచెస్టర్‌: కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ప్రపంచ క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)అనేక కొత​ నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బంతిని లాలాజలంతో(సలైవా) రుద్ద కూడదనే నిబంధనను కచ్చితత్వం చేసింది. కాగా, ఈ నిబంధనలను తొలిసారి ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డామ్‌ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ల రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు సిబ్లీ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. బంతిని అందుకున్న మరుక్షణమే అనుకోకుండా చేతితో లాలాజలాన్ని బంతిపై రుద్ది నిబంధనలను ఉల్లంఘించాడు. నాలుగో రోజు లంచ్‌కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా చేతి వేళ్లను నోటి దగ్గరకు పోనిచ్చాడు. వెంటనే లాలాజలాన్ని బంతిపై రుద్ది నాలుక కరుచుకున్నాడు. ఈ విషయం అంపైర్లకు తెలియడంతో బంతిని తీసుకుని శానిటైజర్‌ టవల్‌తో శుభ్రం చేశారు. సలైవా నిబంధనను మొదటిసారి బ్రేక్‌ చేసిన సిబ్లీ చర్యకు అంపైర్లకు తిప్పలు తప్పలేదు. ఏం చేయాలో తెలియక బంతిని శానిటైజ్‌ చేశారు. (‘జస్‌ప్రీత్‌ బుమ్రాతో చాలా డేంజర్‌’)

తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్‌ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు బ్రాడ్‌ (3/66), వోక్స్‌ (3/42), స్యామ్‌ కరన్‌ (2/70) రాణించారు. విండీస్‌ జట్టులో బ్రాత్‌వైట్‌ (75; 8 ఫోర్లు), బ్రూక్స్‌ (68; 11 ఫోర్లు), చేజ్‌ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. మరి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని నిర్దేశించి విజయం కోసం పోరాడుతుందో.. లేక డ్రాతోనే సరిపెట్టుకుంటుందో చూడాలి. (టి20 ప్రపంచకప్‌ భవితవ్యం తేలేది నేడే)

మరిన్ని వార్తలు