మరో విజయమే లక్ష్యంగా టీమిండియా..

27 Jun, 2019 14:40 IST|Sakshi

మాంచెస్టర్‌: వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు వరల్డ్‌క్‌పలో మరో పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఆఖరి ఓవర్లో విజయం సాధించినా.. గురువారం అంతకంటే బలమైన వెస్టిండీస్‌ తో పోరుకు సమాయత్తమైంది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో తిరుగులేకుండా ఉన్నా... కీలక సమయాల్లో సరైన భాగస్వామ్యాలు రాకపోవడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆందోళన చెందుతోంది. ముఖ్యమైన రెండో పవర్‌ ప్లేలో మిడిలార్డర్‌ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు.

ఇక పేస్‌ బౌలింగే ఆయుధంగా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన వెస్టిండీస్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టోర్నీలో ఏకైక విజయం అందుకుంది. న్యూజిలాండ్‌తో గత మ్యాచ్‌లో బ్రాత్‌వైట్‌ అద్భుత పోరాట పటిమ చూపడంతో విండీస్‌ గెలుపు అంచుల దాకా వచ్చింది. కానీ కేవలం ఐదు పరుగులతో ఓటమి చవిచూడడంతో నిరాశలో కూరుకుపోయింది. ఓపెనర్లు శుభారంభాలు అందించకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో విండీస్‌ అనుకున్న ఫలితాలు సాధించ లేక పోతోంది. పించ్‌ హిట్టర్‌ రస్సెల్‌ గాయంతో దూరం కావడం మరో దెబ్బ. ఈనేప థ్యంలో భారత్‌ను ఏమాత్రం ప్రతిఘటిస్తుందో చూడాలి.

భారత్, వెస్టిండీస్‌ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్‌... 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్‌ల్లో భారత్, మూడు మ్యాచ్‌ల్లో విండీస్‌ గెలిచాయి. తాజా మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

తుది జట్లు
భారత్‌
విరాట్‌ ​కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విజయ్‌ శంకర్‌, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, బుమ్రా

వెస్టిండీస్‌
జేసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, సునీల్‌ అంబ్రిస్‌, షాయ్‌ హోప్‌, నికోలస్‌ పూరన్‌, షిమ్రాన్‌ హెట్‌మైయిర్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నీ థామస్‌


 


 

మరిన్ని వార్తలు