విజేత చార్మినార్ సీసీ

15 Oct, 2013 23:56 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్: క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్‌సీఏ) నిర్వహించిన అండర్-12 టోర్నీలో చార్మినార్ సీసీ జట్టు విజేతగా నిలిచింది. సెయింట్ పీటర్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చార్మినార్ సీసీ జట్టు బ్యాట్స్‌మన్ అర్బాజ్ ఖాన్ (56) అర్ధ సెంచరీతో చెలరేగడంతో జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
 మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ పీటర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జట్టులో వికాస్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, హర్షవర్ధన్ 32 పరుగులు చేశాడు. చార్మినార్ సీసీ బౌలర్ అబ్దుల్ అఖీబ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన చార్మినార్ సీసీ జట్టు 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది.
 
  అబ్దుల్ అఖీబ్ 31, జూనైద్ 18 పరుగులు చేశారు. సెయింట్ పీటర్స్ బౌలర్ హర్షవర్ధన్ రెడ్డి రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో  సెయింట్ పీటర్స్ 33 పరుగుల తేడాతో బ్రదర్స్ సీఏపై, చార్మినార్ సీసీ 6 వికెట్ల తేడాతో ఏఏసీఏపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి.
 
  ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారాన్ని సెయింట్ పీటర్స్ ఆటగాడు హర్షవర్ధన్ రెడ్డి (బ్యాటింగ్ 264, బౌలింగ్ 8 వికెట్లు) దక్కించుకున్నాడు. ‘బెస్ట్ బౌలర్’ అవార్డు చార్మినార్ సీసీ ఆటగాడు అద్నాన్ (17 వికెట్లు)కు లభించింది. ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’ పురస్కారం బ్రదర్స్ సీఏ (రెడ్) ఆటగాడు తిలక్ వర్మ (247 పరుగులు) కైవసం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు