యూపీ విజార్డ్స్ విజయం

16 Feb, 2015 01:10 IST|Sakshi

లక్నో: తమ సొంత వేదికపై ఆడిన చివరి మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 3-2 తేడాతో దబాంగ్ ముంబైపై గెలిచింది. దీంతో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఎనిమిదో నిమిషంలోనే ముంబై ఆటగాడు వికాస్ పిళ్లై గోల్ నమోదు చేశాడు. అయితే 29వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య ఫీల్డ్ గోల్‌తో విజార్డ్స్ 1-1తో స్కోరును సమం చేసింది.
 
 44వ నిమిషంలో గ్లెన్ టర్నర్ తిరిగి ముంబైకి ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో దూకుడుగా ఆడిన విజార్డ్స్ హర్జీత్ సింగ్, నిక్కిన్ తిమ్మయ్య గోల్స్‌తో గట్టెక్కింది.
 ఢిల్లీని ఓడించిన కళింగ: హెచ్‌ఐఎల్ మరో లీగ్ మ్యాచ్‌లో కళింగ లాన్సర్ 2-1 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. పేలవ ఆటతీరుతో ఇప్పటికే నాకౌట్ అవకాశాలను కోల్పోయిన కళింగ తమ చివరి మ్యాచ్‌లో మెరిసింది. అరన్ జలేస్కి (40వ ని.), రస్సెల్ ఫోర్డ్ (49వ ని) కళింగ తరఫున గోల్స్ చేయగా, ఆండీ హేవార్డ్ (29వ ని.) ఢిల్లీకి ఏకైక గోల్ అందించాడు.
 

మరిన్ని వార్తలు