ధోని మార్క్‌ కీపింగ్‌.. తరంగ సెంచరీ మిస్‌

17 Dec, 2017 16:00 IST|Sakshi

సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్‌ కీపింగ్‌ను ప్రదర్శించాడు. దీంతో శ్రీలంక ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ 95( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ చేజార్చుకున్నాడు.

భారత చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని ఉపుల్‌ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్‌ ఆన్‌ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. దీంతో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి ఇది అందరూ నాటౌట్‌ అనుకున్నా థర్డ్‌ అంపైర్‌ వికెట్‌గా ప్రకటించడంతో మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు.

ధోని వ్యూహంతో డిక్‌వెల్లా అవుట్‌..
ఇక ఇదే ఓవర్‌ ఐదో బంతికి ధోని వ్యూహంతో కుల్దీప్‌ డిక్‌వెల్లాను అవుట్‌ చేశాడు. బంతి వేసే ముందు కుల్దీప్‌ దగ్గరకు వచ్చిన ధోని స్లిప్‌లో అయ్యర్‌ను ఫీల్డింగ్‌ పెట్టుకోమని సూచించాడు.  ఈ బంతి డిక్‌వెల్లా బ్యాట్‌ను తగిలి నేరుగా అయ్యర్‌ చేతిలో పడింది. ఈ వికెట్‌తో ధోని వ్యూహం ఫలించింది. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది. ధోని ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్టంప్‌అవుట్‌లు సాధించిన కీపర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు