సొంతగడ్డపై బోల్ట్‌ చివరి రేస్‌

11 Jun, 2017 23:54 IST|Sakshi
సొంతగడ్డపై బోల్ట్‌ చివరి రేస్‌

కింగ్‌స్టన్‌: జమైకా మేటి స్ప్రింట్‌ రన్నర్‌ ఉసేన్‌ బోల్ట్‌ తన సొంతగడ్డపై చివరి విజయాన్ని అందుకున్నాడు. 2002లో తాను ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించిన ట్రాక్‌పైనే శనివారం రాత్రి జరిగిన 100 మీటర్ల రేసును 10.03 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది బోల్ట్‌ తలపడిన తొలి 100 మీటర్ల ఈవెంట్‌ ఇదే కావడం విశేషం. వచ్చే ఆగస్టులో లండన్‌లో జరగనున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత బోల్ట్‌ రిటైర్మెంట్‌ తీసుకోనున్నాడు.

ఈ నేపథ్యంలో  సొంతగడ్డపై ఇదే చివరి పోటీ కావడంతో తమ అభిమాన ఆటగాడి ప్రదర్శనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య విజయాన్నందుకున్న 30 ఏళ్ల ఈ జమైకన్‌ చిరుత చివరిసారిగా ట్రాక్‌ను ముద్దాడి ప్రేక్షకులను అలరించాడు. ఈ పోటీలో కొత్త రికార్డు నెలకొల్పడం కన్నా తన అభిమానులను అలరించడమే ధ్యేయంగా బరిలోకి దిగినట్లు గతేడాది రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన బోల్ట్‌ చెప్పాడు.

మరిన్ని వార్తలు