‘రోహిత్‌ శర్మకు అవకాశం ఇవ్వండి’

1 Dec, 2018 13:20 IST|Sakshi

లండన్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా గాయపడి తొలి టెస్టుకు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో రోహిత్‌ శర్మకు అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సూచించాడు. రోహిత్‌ను తుది జట్టులోకి తీసుకుని టాపార్డర్‌లో ఆడిస్తే బాగుంటుందన్నాడు. ‘ పృథ్వీ షా ఒక అసాధారణ యువ క్రికెటర్‌. అతను గాయపడటం జట్టుకు లోటే. కాకపోతే పృథ్వీ షా స్థానంలో రోహిత్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. రోహిత్‌కు టెస్టు క్రికెట్‌లో మంచి గణాంకాలు లేకపోయినా అతను మంచి క్రికెటర్‌’ అని వాన్‌ పేర్కొన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ  పృథ్వీ షా గాయపడి తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని స్థానంలో రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద‍్ర వేసిన రోహిత్‌ను టెస్టు ఫార్మాట్‌లో సైతం మరొకసారి ప్రయోగించి చూడాలని కోరుతున్నారు. ఆసీస్‌తో నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్‌ 6వ తేదీన ఆడిలైడ్‌లో జరుగనుంది.
 

మరిన్ని వార్తలు