సెలక్షన్‌ కమిటీకి వెంకటేశ్‌ ప్రసాద్‌ రాజీనామా!

3 Mar, 2018 09:50 IST|Sakshi
వెంకటేశ్‌ ప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

 

సాక్షి, స్పోర్ట్స్‌ : అండర్-19 ప్రపంచకప్ గెలిచి నెల కూడా తిరుగకుండానే జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. సుమారు 30 నెలలుగా ఈ పదవిలో కొనసాగిన వెంకటేశ్‌ ప్రసాద్‌ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశాన్ని ప్రసాద్‌ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

కొన్ని ఇతర క్రికెట్‌ అసైన్‌మెంట్‌ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారని, అవి ఏమిటో రాజీనామా పత్రంలో స్పష్టతనివ్వలేదని బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మీడియాకు తెలిపారు. అతని స్థానంలో ప్రత్యామ్నయంగా ఎవరి ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరి కొద్ది రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామ సీకే ఖన్నా పేర్కొన్నారు.

ఇక ప్రసాద్‌ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూనియర్‌ జట్లు (అండర్‌-19, భారత్‌-ఏ) అద్బుత ప్రదర్శన కనబర్చాయి. దీంతో  అప్పట్లో ఆయనకు సీనియర్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ జూనియర్‌ ప్యానెల్‌లోనే కొనసాగించింది. ఇక జాతీయ సెలక్టర్లుగా ఉన్న ఆరుగురి సభ్యుల్లో(ముగ్గురు జూనియర్‌, ముగ్గురు సీనియర్‌) వెంకటేశ్‌ ప్రసాదే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.  ఆయన తన కెరీర్‌లో 33 టెస్టులు, 161 వన్డేలాడారు.

మరిన్ని వార్తలు