సోదరిపై వీనస్‌ విజయం

13 Mar, 2018 12:17 IST|Sakshi

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో నల్ల కలువ సెరెనా విలియమ్స్‌పై అక్క వీనస్‌ విలియమ్స్‌ విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ లో భాగంగా మూడో రౌండ్‌ పోరులో వీనస్‌ విలియమ్స్‌ 6-3, 6-4 తేడాతో సెరెనాపై గెలుపొందింది.

సుమారు గంటకు పైగా సాగిన మ్యాచ్ లో సెరీనా 41 అనవసర తప్పిదాలు చేసింది. దీంతో వీనస్ విలియమ్స్ ను విజయం వరించింది. గతేడాది సెప్టెంబరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్ నుంచి తప్పుకుంది. అనంతరం ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నీలో మళ్లీ రాకెట్‌ చేతబట్టింది. అయితే ఈ టోర్నీలో సెరెనా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన 28 మ్యాచ్‌ల్లో సెరెనా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వీనస్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందారు. అక్కా చెల్లెల్ల మధ్య జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిది మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించారు. 1998 ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరూ ముఖాముఖి పోరులో తొలిసారి తలపడగా,  2014 తర్వాత సెరెనాపై వీనస్‌ విజయాన్ని సాధించడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు