పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌.. వీడియో వైరల్‌

8 Sep, 2019 14:07 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌లు ఆడినట్లు ఉన్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాళ్లు అయ్యి ఉండి పాకిస్తాన్‌ తరఫున ఆడటం, అందులోనూ దాయాది దేశం కోసం ఆడటాన్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎంతమాత్రం సహించరు. కాకపోతే ఇది ఎవరో సృష్టించిన వీడియో. దీన్ని ఒక పాకిస్తాన్‌ జర్నలిస్టు షేర్‌ చేశాడు.  ఇందుకు ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ‘పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు శ్రీనగర్‌లో క్రికెట్‌ ఆడుతుంది. పాకిస్తాన్‌ తరఫున కోహ్లి ఆడుతున్నాడు’ అని పేర్కొన్నాడు. 2025లో శ్రీనగర్‌ క్రికెట్‌ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ భాగంగా కోహ్లి, ధావన్‌లు పాకిస్తాన్‌ జట్టు తరఫున ఆడుతున్నట్లు చూపించారు. పాకిస్తాన్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ కాగా, కోహ్లి, ధావన్‌లతో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు కూడా గ్రీన్‌ జెర్సీల్లో ఉన్నట్లు ఒక వీడియోను సృష్టించి వైరల్‌ చేశారు.

గత శుక్రవారం అంటే సెప్టెంబర్‌6వ తేదీన పాకిస్తాన్‌ డిఫెన్స్‌ డే జరుపుకుంది. ఈ మేరకు ఒక వీడియోను రూపొందించడమే కాకుండా భారత ప్రధాన ఆటగాళ్లంతా పాక్‌ తరఫున ఆడుతున్నట్లు చిత్రీకరించారు. ఈ మ్యాచ్‌ను కొంతమంది కలిసి చూస్తుండగా అందులో ఒక బాలిక మాట్లాడుతూ.. ‘ ఈరోజు పాకిస్తాన్‌ను కోహ్లి గెలిపిస్తాడు’ అని పేర్కొనడాన్ని కూడా జత చేశారు. దీనిపై భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ‘ కోహ్లి పాకిస్తాన్‌ తరఫున ఆడటమా.. అది ఎప్పటికీ జరగదు’ అని ఒకరు కామెంట్‌ చేయగా, ‘భారత జట్టులోని ఆటగాళ్లంటే పాకిస్తాన్‌కు ఎంత ప్రేమో’ అని మరొకరు పేర్కొన్నారు. ‘ శిఖర్‌ ధావన్‌ను 3వ స్థానంలో ఆడించండి’ మరొకరు సెటైర్‌ వేశారు.

మరిన్ని వార్తలు