ఆధిక్యంలో విదిత్, గ్రోవర్

16 Sep, 2013 01:46 IST|Sakshi

కొకెలీ (టర్కీ): ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు విదిత్ గుజరాతీ, సహజ్ గ్రోవర్‌లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలుర రెండో రౌండ్‌లో గుజరాతీ... థామస్ లౌరుసస్ (లిథువేనియా)పై గెలిచాడు. నల్లపావులతో గేమ్ ఆరంభించిన భారత కుర్రాడు ఎండ్ గేమ్‌లో ఆకట్టుకున్నాడు. ఎలాంటి తప్పిదం చేయకుండా గేమ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. మరో గేమ్‌లో గ్రోవర్... 20 ఎత్తుల్లో యెచెస్లావ్ లోజినికోవ్ (కజకిస్థాన్) ఆట కట్టించాడు.
 
 ఈ రౌండ్ అనంతరం ఈ ఇద్దరు చెరో రెండు పాయింట్లతో మరో 15 మందితో కలిసి సంయుక్తగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇతర గేమ్‌ల్లో శ్రీనాథ్ (1)... సలీహ్ జైదాన్ (టర్కీ-0)పై గెలవగా; ఎస్‌ఎల్ నారాయణ (1).... యు యాంగ్వే (చైనా-2) చేతిలో; సమీర్ (1).... అంటోనిస్ పావిల్డిస్ ((జర్మనీ-2) చేతిలో ఓటమి పాలయ్యారు. ఎస్‌పీ సేతురామన్ (1.5).... సిమోన్ డి ఫిలిమోనో (ఇటలీ-1.5); దేబాశిష్ దాస్ (1.5)... సామ్యూల్ ఫ్రాంక్లిన్ (ఇంగ్లండ్-1.5); రాకేశ్ కులకర్ణీ (0.5).... ఖదీర్ జోల్ అల్బెర్ (టర్కీ-0.5)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.
 
 బాలికల విభాగంలో రియా సావంత్ (1)... బుస్రా సోయదాన్ (టర్కీ-0)పై నెగ్గింది. ఇతర గేమ్‌ల్లో పద్మిని రౌత్ (1).... జియో ఈయి (చైనా-2) చేతిలో; మరియా ఫుర్టాడో (1)... మదీనా వార్డా అవులియా (ఇండోనేసియా-2) చేతిలో; అంజనా కృష్ణ (0)... దోర్సా (1) చేతిలో ఓడిపోయారు.
 
 

మరిన్ని వార్తలు