హైదరాబాద్‌ విజయం

2 Oct, 2019 08:53 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకతో మంగళవారం జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో రాయుడు స్ఫూర్తిదాయక అర్ధ సెంచరీ (111 బంతుల్లో 87 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దీంతో హైదరాబాద్‌ 21 పరుగుల తేడాతో హేమాహేమీలున్న కర్ణాటకపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది రెండో గెలుపు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

హైదరాబాద్‌ ఒకదశలో 121/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు ఓర్పుతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతను సీవీ మిలింద్‌ (36; 4 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం బెంగళూరు 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడింది. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ (4/35), సిరాజ్‌ (2/38) ఆకట్టుకున్నారు. కర్ణాటక జట్టులో దేవదత్‌ పడిక్కల్‌ (60; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు