మెరిసిన తిలక్‌ వర్మ

11 Oct, 2019 09:07 IST|Sakshi
తిలక్‌ వర్మ(ఫైల్‌ ఫోటో)

ఆంధ్రపై 7 పరుగుల తేడాతో  హైదరాబాద్‌ విజయం

విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ

ఆలూరు(కర్ణాటక): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైద రాబాద్‌ మరో విజ యాన్ని ఖాతాలో వేసుకుంది. గురు వారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్‌ వర్మ (83: 59 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు.

మిగిలిన వారిలో తన్మయ్‌ అగర్వాల్‌(18), అంబటి రాయుడు(17), భవనాక సందీప్‌(28), హిమాలయ్‌ అగర్వాల్‌(11) రెండంకెల స్కోరు చేశారు. అక్షత్‌ రెడ్డి(3), సీవీ మిలింద్‌(5) నిరాశపరిచారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా, షోయబ్‌ ఎండీ ఖాన్, కేవీ శశికాంత్, దాసరి స్వరూప్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఛేదనలో శ్రీకర్‌ భరత్‌(2) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగ్గా, ప్రణీత్‌(1) స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో ప్రశాంత్‌ కుమార్‌(57: 42బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ రికీ భుయ్‌(58: 40 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించడంతో ఆంధ్ర విజయం దిశగా దూసుకెళుతున్నట్లు కనిపించింది. అయితే, వీరిద్దరూ వెనుదిరిగాక తడబడిన మిగిలిన వారు రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో సీవీ మిలింద్‌ 3, రవికిరణ్‌ 2 వికెట్లు పడగొట్టారు.  

మరిన్ని వార్తలు