అంబటి రాయుడు ట్వీట్‌పై విజయ్‌ శంకర్‌ స్పందన

25 May, 2019 15:01 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్ జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంతో కొద్దిరోజుల క్రితం అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెలలో 15 మందితో కూడిన భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేసిన సమయంలో రాయుడ్ని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కాగా, అతని స్థానంలో విజయ్‌ శంకర్‌కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. రాయుడితో పోలిస్తే..? విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో (త్రీ డైమన్షన్స్‌) టీమ్‌కి ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అప్పడే వివరణ ఇచ్చారు.

ప్రపంచకప్‌ జట్టు ప్రకటన  మరుసటి రోజు చీఫ్ సెలక్టర్ వివరణపై అంబటి రాయుడు చురకలేస్తూ ఓ ట్వీట్ వదిలాడు ‘వరల్డ్‌ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను’ అని సెటైర్ వేశాడు. దీంతో విజయ్ శంకర్‌కి పరోక్షంగా రాయుడు కౌంటరిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. దీనిపై రాయుడు, శంకర్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ తాజాగా ఎట్టకేలకి విజయ్ శంకర్ ఆ ట్వీట్‌పై పెదవి విప్పాడు. గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌’ షోలో విజయ్‌ శంకర్‌ దానిపై స్పందించాడు. అప్పట్లో అంబటి రాయుడు చేసిన ‘త్రీడీ’ ట్వీట్‌ తనపై కాదన్నాడు. అదే సమయంలో రాయుడికి మద్దతుగా నిలిచాడు విజయ్‌ శంకర్‌. ‘జట్టులోకి ఎంపికవకపోతే సదరు క్రికెటర్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంబటి రాయుడు పరిస్థితిని ఓ క్రికెటర్‌గా నేను అర్థం చేసుకోగలను. అది బాధలో రాయుడు చేసిన ట్వీట్‌ మాత్రమే. ఆ త్రీడీ ట్వీట్ నా గురించి కాదు’ అని విజయ్‌ శంకర్‌ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు