వినేశ్‌ ఫొగాట్‌ హ్యాట్రిక్‌

5 Aug, 2019 06:19 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పట్టిన పట్టు ప్రతి వారం బంగారమవుతోంది. ఆమె వరుసగా మూడో వారం కూడా పసిడి పతకం నెగ్గింది. వార్సాలో జరుగుతున్న పొలాండ్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో ఆమె మహిళల 53 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ బౌట్‌లో 24 ఏళ్ల భారత రెజ్లర్‌ 3–2తో పొలాండ్‌కు చెందిన రొక్సానాపై విజయం సాధించింది. స్వర్ణం నెగ్గే క్రమంలో ఆమె... క్వార్టర్‌ ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సోఫియా మాట్సన్‌ (స్వీడెన్‌)ను కంగుతినిపించింది. గత నెలలో వినేశ్‌ స్పెయిన్‌ గ్రాండ్‌ప్రితో పాటు టర్కీలో జరిగిన యాసర్‌ డొగు ఇంటర్నేషనల్‌ టోర్నీలో బంగారు పతకాలు నెగ్గింది. హ్యాట్రిక్‌ స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్‌ను  భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌), ఒలింపిక్స్‌ గోల్డ్‌క్వెస్ట్‌ (ఓజీక్యూ) ప్రశంసలతో ముంచెత్తింది. ఓ చాంపియన్‌ రెజ్లర్‌కు అండదండలు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఓజీక్యూ సీఈఓ రస్కిన్హా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు