ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

29 Jul, 2019 02:00 IST|Sakshi
వినేశ్‌ ఫొగాట్‌

ట్రయల్స్‌లో సత్తా చాటిన భారత స్టార్‌ రెజ్లర్లు  

లక్నో: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), సాక్షి మలిక్‌ (62 కేజీలు) సత్తా చాటారు. ఆదివారం జరిగిన ఈ ట్రయల్స్‌ ఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ ఫొగాట్‌ 9–0తో పింకీపై గెలుపొందగా... రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌  13–2తో రేష్మా మన్‌ను అలవోకగా ఓడించి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. వీరిద్దరితో పాటు సీమా బిస్లా (50 కేజీలు), సరితా మోర్‌ (57 కేజీలు), దివ్య కక్రాన్‌ (68 కేజీలు), కిరణ్‌ గొడారా (76 కేజీలు) వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. దివ్య కక్రాన్‌ 6–3తో నవ్‌జోత్‌ కౌర్‌పై విజయం సాధించగా... 57 కేజీల విభాగంలో బెర్త్‌ కోసం పూజ, అన్షు మలిక్, మంజు, సరిత గట్టిగా పోటీపడ్డారు. కానీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత పూజ దండాను వెనక్కి నెట్టి సరిత భారత జట్టులోకి ఎంపికైంది. కజకిస్తాన్‌ వేదికగా సెప్టెంబర్‌ 14 నుంచి 22 వరకు ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. ఆదివారం జరిగిన ట్రయల్స్‌ వెయిట్‌ కేటగిరీలన్నీ ఒలింపిక్స్‌లో భాగంగా ఉండగా... ఆగస్టు రెండో వారంలో ఒలింపిక్స్‌ క్రీడల్లో లేని వెయిట్‌ కేటగిరీలకు ట్రయల్స్‌ నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు