గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రస్తుతం తమకు దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకోగా, పరి మూవీ విడుదలైన అనంతరం అనుష్కకు కొద్దిపాటి విరామం దొరికింది. దాంతో ఈ జంట తమ హాలీడే స్పాట్ను ఆస్వాదిస్తున్నారు. కాగా, ఎప్పుడు వార్తల్లో నిలిచే వీరిద్దరి గురించి ఇప్పుడు మరో కొత్త వార్త బీటౌన్లో చక్కర్లు కొడుతుంది. అది వారి అద్దె ఇంటి గురించి.
విరుష్క జోడీ ఉండబోయే ఇంటి అద్దె అక్షరాలా పదిహేను లక్షలట. ముంబైలోని వొర్లి ఏరియాలో ఓ ఇంటిని రెండేళ్లకు గానూ లీజుకు తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు రెండేళ్ల క్రితం వొర్లి ఏరియాలో ఓ ఇంటిని రూ. 36 కోట్లకు కొనుగోలు చేసిన కోహ్లి.. ఇంకా దానికి హంగులు దిద్దే పనిలో ఉన్నాడు. దాంతో ఆ జంట తాత్కాలికంగా అద్దె ఇంటిలో నివసిస్తూ భారీగా అద్దె చెల్లించడం హాట్ టాపిక్గా మారింది. దీనికిగానూ కోటిన్నర డిపాజిట్ చేయగా, దాదాపు మరో కోటితో అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అత్యాధునిక హంగులతో కూడిన నిర్మాణం, ప్రత్యేకంగా జాగింగ్, వాకింగ్ చేసుకునేందుకు కారిడార్స్ కూడా ఉన్నాయట. ముంబైలోని ఫేమస్ ప్రాంతాల్లో వోర్లి ఒకటి. ఇదిలా ఉంచితే, విరాట్ కోహ్లి త్వరలోనే తన కొత్త ఇంటికి మారడానికి సన్నాహాలు చేస్తున్నాడు.