విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!

31 Mar, 2020 04:01 IST|Sakshi

మిథాలీ వితరణ రూ. 10 లక్షలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరు కోసం అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పీఎం–కేర్స్‌ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది. ‘అనుష్క, నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అందించే ఈ సహాయం కొంతమందికైనా ఊరట కలిగిస్తుందని నమ్ముతున్నాం. కరోనా సృష్టిస్తోన్న విలయం చూస్తుంటే  మా హృదయం తరుక్కుపోతుంది’ అని కోహ్లి ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

మరోవైపు భారత మహిళల వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ రూ. 5 లక్షలు పీఎం–కేర్స్‌ ఫండ్‌కు... రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపింది. మరో మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యన్‌ రూ. లక్షా 25 వేలు విరాళంగా ప్రకటించాడు. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్, రాజ్యసభ ఎంపీ హోదాలో తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ 18 ఏళ్ల టీనేజ్‌ షూటర్‌ మను భాకర్‌ లక్ష రూపాయల్ని హరియాణా ప్రభుత్వానికి ఇచ్చింది.

మరిన్ని వార్తలు