కోహ్లిని ఊరిస్తున్న భారీ రికార్డు

13 Jun, 2019 13:36 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: మరో భారీ రికార్డు ముంగిట టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి నిలిచాడు. ఇప్పటికే అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సొంతం చేసుకున్న కోహ్లి.. గురువారం న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 57 పరుగులు చేస్తే.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. అందరికంటే వేగంగా (222 ఇన్నింగ్స్‌లలో) వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కోహ్లి ఘనత సొంతం చేసుకోనున్నాడు.  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 276 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి దాటాడు. అంతేకాదు, క్రికెట్‌లోకి వచ్చిన 11 ఏళ్ల లోపే ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడిగానూ కోహ్లి రికార్డుల్లో నిలిచిపోతాడు. 

వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని దాటిన ప్రపంచంలో తొమ్మిదో క్రికెటర్‌గా, మూడో భారత ఆటగాడిగా కోహ్లి నిలువనున్నాడు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ భారత్‌ నుంచి ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ జాబితాలో గంగూలీని అధిగమించి.. ఎనిమిదో స్థానానికి కోహ్లి ఈ ప్రపంచకప్‌లోనే ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. గంగూలీ 11,363 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లి ఈ పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక, మరో చిన్న రికార్డు కూడా కోహ్లిని న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేస్తే.. ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా వీరేందర్‌ సెహ్వాగ్‌, రింకీ పాంటింగ్‌ల సరసన అతను చేరుతాడు. కివీస్‌పై సెహ్వాగ్‌, పాంటింగ్‌లు తలో సెంచరీలు చేయగా, కోహ్లి ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు.
 

మరిన్ని వార్తలు