దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో కోహ్లి 912 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. స్టీవ్ స్మిత్ 947 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. మరొకవైపు భారత ఆటగాడు చతేశ్వర పుజారా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల విభాగంలో రవి చంద్రన్ అశ్విన్ ఆరో స్థానానికి పడిపోయాడు.
ఇక ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐదో స్థానంలో నిలిచి తన కెరీర్ అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. స్టార్క్ 805 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు.