సోషల్‌మీడియాలో ఒక్క పోస్ట్‌.. కోహ్లికి అన్ని కోట్లా!

9 Nov, 2017 14:32 IST|Sakshi

న్యూడిల్లీ : ప్రపంచంలో అధికంగా సంపాదించే ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒకరు. అయితే సోషల్‌ మీడియా పోస్ట్‌ల ద్వారా కోహ్లికి ఆదాయం ఎంత వస్తుందన్న దానిపై ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోహ్లికి ట్విట్టర్‌లో 20 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోయర్లుండగా, ఫేస్‌బుక్‌లో 36 మిలియన్ల మంది ఈ క్రికెటర్‌ పేజీని లైక్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌ ద్వారా కోహ్లికి రూ. 3.2 కోట్ల ఆదాయం వస్తుందట. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో దాదాపుగా ఇంతే ఆర్జిస్తాడని సమాచారం.

కోహ్లికున్న క్రేజ్‌ గురించి ఇంకా చెప్పాలంటే.. ఫుట్‌బాల్‌ లెజెండ్‌ లియోనల్‌ మెస్సీ బ్రాండ్‌ వ్యాల్యూకంటే భారత కెప్టెన్‌కే గుర్తింపు ఎక్కువ. గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ రోరి మెకల్‌రాయ్‌, గోల్డెన్‌ స్టేట్‌ వారియర్స్‌ - స్టీఫెన్‌ కర్రీల కంటే కోహ్లీ వార్షికాదాయం ఎక్కువన్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ సహా మరికొన్ని సామాజిక మాధ్యమాలలో ప్రమోషనల్‌ పోస్టులు, ట్వీట్ల ద్వారా కొందరు సెలబ్రిటీలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తుంటారు. మరోవైపు లంకతో సిరీస్‌కు కోహ్లి సన్నద్ధం అవుతున్నాడు.

మరిన్ని వార్తలు