కెప్టెన్‌ అయినంత మాత్రాన అలా చేస్తావా?

29 Feb, 2020 10:55 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దారుణంగా విఫలమవుతున్నాడు. కాగా, కివీస్‌తో రెండో టెస్టులో కోహ్లి డీఆర్‌ఎస్‌కు వెళ్లడం విమర్శలకు దారి తీసింది. అది క్లియర్‌గా ఔట్‌ అని తెలుస్తున్నా, ఎందుకు రివ్యూను వృథా చేశావంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 3 పరుగులే చేసి ఔటయ్యాడు. సౌతీ వేసిన ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ తొలి బంతికి కోహ్లి ఎల్బీ అయ్యాడు. దానిపై ఎటువంటి ఆలోచన లేకుండా కోహ్లి రివ్యూ కోరడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.  

ప్రధానంగా 2016  నుంచి ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి టెస్టుల్లో 14 సార్లు రివ్యూలు కోరితే రెండు సార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. బ్యాట్స్‌మన్‌ కోహ్లి కోరిన 14లో 9 వ్యతిరేక ఫలితాలు రాగా, మూడు అంపైర్స్‌ కాల్స్‌ అయ్యాయి. ఇక రెండు మాత్రమే కోహ్లికి అనుకూలంగా వచ్చాయి. చివరిసారి 2017-18 సీజన్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మాత్రమే కోహ్లికి అనుకూలంగా నిర‍్ణయం వచ్చింది. ఒక కెప్టెన్‌గా డీఆర్‌ఎస్‌లను కోరడంలో విఫలమవుతున్న కోహ్లి.. ఆటగాడిగా కూడా రివ్యూల విషయంలో సఫలీ కృతం కాకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

‘క్రికెట్‌ అనేది జట్టు గేమ్‌.. కోహ్లిది కాదు. జట్టు గురించి ఆలోచించి మాత్రమే కోహ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఒక అభిమాని నిలదీశాడు. ‘కేవలం టెస్టుల్లో తన ఎల్బీ నిర్ణయాల్లో 15 శాతం మాత్రమే సక్సెస్‌ అయిన విషయాన్ని కోహ్లి గుర్తించుకోవాలి’ అని మరొకరు ప్రశ్నించారు. ‘ కెప్టెన్‌గా అధికారం ఉందని జట్టు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి డీఆర్‌ఎస్‌ నిర్ణయాలను తీసుకుంటావా’ అని మరొకరు వేలెత్తి చూపారు. ‘ కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇలా చేస్తావా’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇలా కోహ్లి రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు తప్పుబట్టారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి సక్సెస్‌ అయితే ఇంతటి విమర్శలు వచ్చేవి కాదు. కోహ్లి వరుసగా విఫలం కావడంతో వరుస పెట్టి విమర్శలు వస్తున్నాయి. (జెమీసన్‌ విజృంభణ.. టీమిండియాది పాత కథే)

>
మరిన్ని వార్తలు