విరాట్‌ కోహ్లికి జరిమానా

23 Jun, 2019 15:05 IST|Sakshi

సౌతాంప్టన్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జరిమానా పడింది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదం చేయడంతో కోహ్లికి జరిమానా విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఒక ఎల్బీడబ్యూ నిర్ణయంపై కోహ్లి అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. భారత జట్టు అప్పీల్‌కు వెళ్లిన సదరు ఎల్బీ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌తో కోహ్లి కాస్త దూకుడుగా ప‍్రవర్తించాడు. (ఇక్కడ చదవండి: కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్‌)

అదే సమయంలో బంతి వికెట్‌పైకి వెళుతుందంటూ వాదించాడు. ఇలా అంపైర్లతో ఒక ఆటగాడు వాదనకు దిగడం ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకం కావడంతో కోహ్లికి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఐసీసీ నియమావళి లెవల్‌-1ను కోహ్లి అతిక్రమించిన కారణంగా జరిమానా విధిస్తూ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కోహ్లి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా పడింది. మహ్మద్‌ షమీ వేసిన ఓ‍వర్‌లో ఒక బంతి అఫ్గాన్‌ ఆటగాడు హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తగిలింది. భారత ఆటగాళ్లంతా అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, బౌలర్‌ షమీతో చర్చించిన కోహ్లి రివ్యూ కోరాడు. అయితే బంతి ఔట్‌ సైడ్‌ పిచ్‌ అవ్వడంతో థర్డ్‌ అంపైర్‌.. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే మొగ్గు చూపాడు. దీనికి సంతృప్తి చెందని కోహ్లి.. అంపైర్‌ అలీమ్‌ దార్‌తో వాదించాడు. ఆ బంతి వికెట్లపైకి వెళుతున్నా ఎందుకు ఔట్‌ ఇవ్వలేదంటూ ప్రశ్నించాడు.


 

మరిన్ని వార్తలు