హ్యపీగా వెళుతున్నారు.. విజయాలతో తిరిగిరండి

16 Nov, 2018 18:50 IST|Sakshi

న్యూ ఢిల్లీ: 64 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లకు విషెస్‌ చెబుతూ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా విమానశ్రయంలో టీమిండియ ఆటగాళ్లు సరదాగా గడిపిన ఫోటోలను షేర్‌ చేసింది. ఇక టీమిండియాలో చోటు దక్కించుకున్న తర్వాత తొలిసారి ఆసీస్‌ పర్యటనకు వెళుతున్న కృనాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌లు సిరీస్‌ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

ఇక అభిమానులు కూడా కోహ్లి సేనకు విషెస్‌ చెబుతున్నారు. సంతోషంగా వెళుతున్నారు.. విజయాలతో తిరగిరండి అంటూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. 2015-16లో ఎంఎస్‌ ధోని సారథ్యంలోని టీమిండియా వన్డే సిరీస్‌ కోల్పోయినప్పటికీ, టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.  ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది.  

సుదీర్ఘకాలం క్రికెట్‌ను శాసించిన జట్లలో ఆసీస్‌ ఒకటి. గతంలో ఓటమి అంటే తెలియని జట్టు.. ఇప్పుడు గెలుపు కోసం తపించిపోతుంది. ఒకవైపు ఆసీస్‌ జట్టును నిలకడలేమీ విపరీతంగా దెబ్బతీస్తుండగా, మరొకవైపు స్టార్‌ క్రికెటర్లు పలు కారణాలతో దూరం కావడం ఆ జట్టుకు శాపంలా మారింది. ఇక వెస్టిండీస్‌పై వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌ విజయాలతో టీమిండియా మంచి జోష్‌లో ఉంది. ఈ పర్యటనలో టీమిండియా ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

మరిన్ని వార్తలు